నన్నపనేని రాజకుమారి ఆవేదన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోని తాజా పరిణామాలతో ఆ పార్టీ అధికార ప్రతినిధి, మహిళా నేత నన్నపనేని రాజకుమారి మనస్తాపానికి గురయ్యారు. ఎమ్మెల్యేల కోటా నుంచి శాసనమండలికి వచ్చిన ఖాళీలో తనకు ఈ సారి అవకాశం ఇస్తారని ఆమె గట్టిగా విశ్వసిస్తుండగా ఆ సీటును తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాకు ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారంటూ ప్రచారం జరుగుతుండటంతో హతాశులయ్యారు.
సుమారు పదేళ్ల క్రితం పార్టీలోకి తిరిగి వచ్చిన రాజకుమారికి అనేక అవకాశాలు అంది వచ్చినట్లే వచ్చి జారిపోయాయి. తన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికీ ఏదో ఒక అవకాశం ఇచ్చారని.. తనను మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ వెనక్కు నెడుతున్నారని ఆమె పార్టీ నేతల వద్ద వాపోయారు. 'గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఎక్కడా పోటీకి అవకాశం ఇవ్వలేదు. రాజ్యసభ, శాసనమండలిలోనూ చోటు కల్పించలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ప్రచారం చేసి వస్తున్నాను. ఈ సారి ఎమ్మెల్సీ ఇస్తే ఎన్నికల్లో రాష్ట్రమంతటా ప్రచారం చేయవచ్చని భావించాను' అంటూ వాపోయారు.
ఆమె పట్ల పార్టీ నేతల్లో సానుభూతి వ్యక్తమవుతుండటం విశేషం. 'శాసనమండలిలో కాంగ్రెస్ సంఖ్యాబలం ఎక్కువ. టీడీపీ ఎమ్మెల్సీలలో మెత్తటి వ్యక్తులే అధికం. వాగ్దాటి ఉన్న రాజకుమారిని మండలికి పంపిస్తే పార్టీకి ప్రయోజనం' అని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. రాజకుమారి విషయం సానుభూతితో పరిశీలించాలని పార్టీ అధినేతను కోరే ప్రయత్నంలో కొందరు నేతలున్నారు.