ఎన్టీఆర్ కంటే నాకే ఆదరణ:చిరు
'మనపార్టీ నిర్వీర్యం అవుతోందని కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు. పుట్టిన 4నెలల్లో ఈ స్థాయికి చేరుకున్నాం. మనకు రికార్డు బద్దలయ్యేంత విజయం ఖాయం అన్నారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని చిరంజీవి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదే కొనసాగితే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం డొల్లగా మారడం ఖాయమని హెచ్చరించారు.
అదే సమయంలో పార్టీ నేతలకు పలు హెచ్చరికలు చేశారు. 'చిరంజీవి ఛరిష్మా చాలు వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తాం అన్న భ్రమలు ఏమైనా ఉంటే దయచేసి పక్కన పెట్టండి. వచ్చే ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే ఆ తప్పు మీది, నాది అవుతుంది తప్ప ప్రజలది కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు.
అభిమానులు సైతం తాను వారికే సొంతం అన్న భావనతో కాక విశాల దృక్పథంతో ఆలోచించి అందరివాడిని చేయాలని సూచించారు. కమిటీలపై నెలకొన్న అసంతృప్తులు త్వరలోనే సమసిపోయానని చెప్పారు. అనంతరం చిరంజీవి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, తూర్పు గోదావరి, కాకినాడ, రాజమండ్రి, కృష్ణా అర్బన్, రూరల్, నెల్లూరు జిల్లా కమిటీలతో విడివిడిగా సమావేశమయ్యారు.