అనంతలో మరో విద్యార్ధినిపై హత్యాయత్నం
అనంతపురం: అనంతపురం పట్టణం అశోక్ నగర్ లో బిందుభారతి అనే ఇంటర్ విద్యార్ధిని మీద ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థినిని గొంతుకోసి తాను ఆత్మహత్యాయత్నం చేసిన గంటలోనే అనంతపురంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
సింగరాయకొండ సంఘటన వివరాలు ఇవి. మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. క్లాస్రూంలోనే ఈ సంఘటన జరగటంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. స్రవంతి అనే విద్యార్థినిపై దాడి చేసిన సహ విద్యార్థి రెండుమూడు సార్లు గొంతుపై బ్లేడుతో కోశాడు.
ఈ రెండు సంఘటనలపై మహిళాసంఘాలు తీవ్రంగా విరుచుకు పడ్డాయి. అన్ని పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్ళు తీవ్రంగా స్పందించారు. విద్యార్ధినులపై దాడులు చేస్తున్న ఉన్మాదులను శిక్షించడానికి చట్టాలకు మరింత పదును పెట్టాలని, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.