నన్నపనేనికి ఎమ్మెల్సీ పదవి
ఇక తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా సంబంధిత వర్గంలో మరింత పట్టు సాధించవచ్చన్న అభిప్రాయం అధినేతలో ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాలసాని ఖమ్మం శాసనసభ నియోకవర్గం నుంచి గత రెండు పర్యాయాలు తెలుగుదేశం తరఫున పోటీచేశారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన ఖమ్మం సీటును మహాకూటమిలోని ఏపార్టీకి ఇచ్చినా అగ్రవర్ణం అభ్యర్థులే పోటీచేసే పరిస్థితులు ఉండటంతో బీసీ అయిన బాలసాని త్యాగానికి ప్రతిఫలంగా శాసనమండలి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అదే సమయంలో బీసీకోటాలో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎస్సీ కోటానుంచి నల్గొండ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, హైదరాబాద్కు చెందిన పి.ఎల్.శ్రీనివాస్ల పేర్లు కూడా చివరినిమిషంవరకు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
మూడో స్థానం ఎవరికి: ప్రతిపక్షాలన్నీ కలిస్తే వీరికి దక్కే అవకాశాలున్న మూడో స్థానం ఏ పార్టీకి ఇస్తారన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో వామపక్షాలు బలపర్చిన అభ్యర్థికి తమ మద్దతు ఇస్తున్నందున... నామినేటెడ్ కోటాలో దక్కనున్న మూడోస్థానం తమకే ఇవ్వాలని తెదేపా వామపక్షాలను అడుగుతోంది. వామపక్షాలు కూడా ఈ స్థానం తమకే కావాలని అడుగుతున్నాయి. మరోవైపు తెరాస కూడా ఈ కూటమితో కలిస్తేనే వీరికి ఈ మూడో స్థానం దక్కుతుంది. చంద్రబాబు సోమవారం అర్థరాత్రి పన్నెండు గంటలు దాటాక ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళారు. ఈ సీటు విషయంపై మాట్లాడేందుకు మంగళవారం సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు రాఘవులు, నారాయణలు చంద్రబాబు నివాసంలో భేటీ అయి చర్చించనున్నారు.