విపక్షాల వల్లే జాప్యం: వైయస్
తాడేపల్లిగూడెం: ఒరిస్సా ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కుమ్మక్కవడం వల్లే పోలవరం ప్రాజెక్టు అనుమతుల్లో జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెజ్జి విమర్శించారు. పోలవరంపై మహాకూటమి తమ విధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తెలుగుదేశం నేతృత్వంలోని మహా కూటమి వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలుగుదేశం, వామపక్షాలు అడ్డుపడకపోతే పోలవరం నీళ్లతో కళకళలాడి ఉండేదని ఆయన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ఆదివారం రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు.
పెనుగొండలోని అతిథిగృహం వద్ద ఆయన పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. 2012 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం వెంకట్రామన్న గూడెం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం తాడేపల్లిగూడెం బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. తనకూ ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదికు మధ్య భావ సారూప్యత ఉందని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.