నక్సల్స్ దాడి: 15 మంది పోలీసులు బలి
ముంబయి: మహారాష్ట్రలో మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దట్టమైన అడవుల్లో మాటువేసి ఓ ఎస్సైతోసహా 15 మంది పోలీసులను బలిగొన్నారు. గడ్చిరోలి జిల్లా సావర్ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు జరిపిన కూంబింగ్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. గత కొంత కాలంగా మహారాష్ట్రలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవు.
తమకు గట్టి పట్టున్న గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు శనివారం రెండు ట్రాక్టర్లను వ్యూహాత్మకంగా దహనం చేశారు. ఇది తెలిసి వారిని గాలించేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆదివారం ఉదయం అడవుల్లోకి ప్రవేశించాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన దాదాపు 100 మంది మావోయిస్టులు గుంపులుగా విడిపోయి పోలీసుల కోసం కాపు కాశారు. వారు రాగానే ఒక్కసారిగా చుట్టుముట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో ఎస్సై ఉపేంద్ర గుడేడ్కర్తోపాటు 15 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టులు పోలీసుల నుంచి రెండు ఏకే 47 తుపాకులతోపాటు మరికొన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందగానే ఎస్పీ రాజేష్ ప్రధాన్ నేతృత్వంలోని ఓ పోలీసు బృందం హెలికాప్టర్లో అటవీ ప్రాంతానికి చేరుకుంది. మృతదేహాలను గడ్చిరోలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అటవీప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ కూంబింగ్లో పోలీసులు ఐదుగురు మావోయిస్టులను కాల్చివేసినట్లు సమాచారం.
'ఈ దాడి మా స్త్థెర్యాన్ని దెబ్బతీయలేదు. మావోయిస్టులపై పోరు కొనసాగుతూనే ఉంటుంది' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు.