సత్యం రాజు విచారణకు సెబీకి అనుమతి
సత్యం అవకతవకలపై సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజును విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెబి సోమవారం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. హైదరాబాద్లో దీనికోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో సుప్రీంకోర్టులో సెబి పిటీషన్ వేసింది. సెబీ తరఫున సోలిసిటర్ జనరల్ జి.ఇ.వాహనవతి ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు.
జ్యుడిష్యల్ కస్టడీలో ఉన్న రామలింగ రాజును విచారించేందుకు తమకు హైకోర్టు అనుమతి నిరాకరించడాన్ని సెబీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రామలింగరాజును, ఆయన సోదరుడు బి.రామరాజును విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 30వ తేదీన అనుమతి నిరాకరించింది. రామలింగరాజును విచారించేందుకు తమకు సెబీకి హక్కు ఉందని వాహనవతి సుప్రీంకోర్టు ముందు వాదించారు. రామలింగరాజును పోలీసులు హైదరాబాదులో జనవరి 9వ తేదీన అరెస్టు చేశారు.