గుర్తు కష్టాల్లో చిరంజీవి
తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల సమయంలో ఒకే గుర్తు కావాలని విజ్ఞప్తి చేసినప్పుడు అది సాధ్యం కాదనీ, ఎవరికీ కేటాయించని గుర్తుల్లో దేనినైనా ఎంచుకోవాలని సూచించామని ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీ తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థులందరూ ఆ గుర్తే కావాలని కోరుకుంటే ఇతర స్వతంత్ర అభ్యర్థులెవరూ అదే గుర్తు అడగని పక్షంలో దానినే కేటాయిస్తామని టిడిపికితెలిపినట్లు కమీషన్ తెలిపింది. 2004 ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే ఎన్నికల గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకుంది. అప్పట్లో తెరాస స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు, సీట్లు సాధించిందని, ఒక శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ గెలుపొందిందని, అయినప్పటికీ ఒకే గుర్తు కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించినట్లు వివరించింది. దీనిని సవాలుచేస్తూ తెరాస హైకోర్టుకు వెళ్లగా పరిశీలించాలని హైకోర్టు కోరిన మేరకు ఒకే గుర్తు కేటాయించామని తెలిపింది.
ప్రతి నియోజకవర్గంలోనూ వేర్వేరు గుర్తులు వస్తే ప్రచారం చేయటం బాగా ఇబ్బందికరమవుతుందనే భావన నేతల్లో నెలకొంది. లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా లోక్సభకు పోటీచేసే అభ్యర్థికి ఒక గుర్తు, శాసనసభ అభ్యర్థికి మరో గుర్తు లభిస్తే గందరగోళం ఏర్పడుతుంది.