రాజు బ్రదర్స్ ను విచారిస్తున్న సెబీ
హైదరాబాద్: ఆర్థిక నేరాలకు పాల్పడిన 'సత్యం' రామలింగరాజు, అతని సోదరుడు రామరాజులను సెబి బృందం బుధవారం చంచల్గూడ జైలులో విచారణ జరుపుతున్నారు. అంతకు ముందు సెబి బృందం జైలు వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాజు సోదరులను జైలులోనే విచారణకు మూడు రోజులు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చిందని ఈ మూడు రోజుల్లో విచారణ జరిపి అన్ని విషయాలు వెలుగులోకి తీసుకువస్తామని సెబి పేర్కొంది.
మూడు వారాల సెబీ నిరీక్షణకు తెరపడింది. 'సత్యం' రామలింగరాజు, అతని సోదరుడు రామరాజులను విచారిచేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది.
బుధవారం ఉదయం నుంచి మూడు రోజుల పాటు రామలింగరాజు సోదరులను విచారించేందుకు సెబీ దర్యాప్తు అధికారి సునీల్ కుమార్ను అనుమతించాలని భారత ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం చంచల్గూడ కేంద్ర కారాగార సూపరిటెండెంట్ను ఆదేశించింది.
ఇందుకు చంచల్గూడ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్, న్యాయమూర్తులు సదాశివం, జె.ఎం. పాంచాల్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలను జారీచేసింది. దీంతో రామరాజు సోదరులను విచారించేందుకు సెబీకి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి.