మెగా ముట్టడి
నల్గొండ: నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు పీఆర్పీ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 23 వరకు మెగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రజారాజ్యం పార్టీ జిల్లా కో-కన్వీనర్ అల్గుబెల్లి అమరేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 26న మెగా ముట్టడి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీని ముట్టడిస్తామని చెప్పారు.
ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 34 వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మెగా పాదయాత్ర ద్వారా గుర్తిస్తామన్నారు. గడపగడపకు వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకుంటామన్నారు.
సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడుతామన్నారు. మెగా పాదయాత్ర నిర్వహించేందుకు 140 మందితో సన్నాహక కమిటీని ప్రకటిస్తామని వివరించారు. పీఆర్పీ జిల్లా కార్యవర్గ సభ్యుడు యడవల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య సమస్య అపరిష్కృతంగా మిగిలిందని, రోడ్లు, లోవోల్టేజీ విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాపోయారు. ఇందిరమ్మ పేరిట జనాకర్ష పథకాలు పెట్టినప్పటికీ అర్హులైన వారికి ఆయా పథకాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.