ఏడుపాయల్లో శివరాత్రి ఉత్సవాలు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో ఉపవాస దీక్షలతో సోమవారం ప్రారంభమయ్యాయి. శివరాత్రి పర్వదినం రోజైన ఈ రోజు ఉదయం నుంచే ఏడుపాయలకు చేరుకున్న భక్తులు గరుడ గంగలో మంజీరా స్నానాలను ఆచరించి ఉపవాస దీక్షలు చేపడతారు.
సాయంత్రం శివాలయంలో ఉపవాస దీక్షలు వదిలిన భక్తులు అమ్మవారి సన్నిధిలో దైవ చింతనలో మునిగిపోయి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినం సోమవారం కలిసిరావడంతో కొత్తగా ఉప వాస దీక్షలు పూనేవారిసంఖ్య అధికంగా ఉంటుంది. మరుసటి రోజు బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉండడంతో మొక్కుబడులు చెల్లించుకోవడానికి భక్తులు తెల్లవారేసరికి జాతరలో కొలువుదీరుతారు. మొక్కుబడులను చెల్లించుకొని మేకపోతులను బలిస్తారు. బోనాల ఊరేగింపు, పోతరాజుల ఈల గోలలు, శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంతం అమ్మవారి నామస్మరణతో దద్దరిల్లిపోతుంది.
ఆలయ ప్రాంగణంలోని వెళ్లే భక్తులను మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి పోలీసులు అణువణువునా తనిఖీ చేస్తున్నారు. జాతర ప్రాంతంలో మెదక్ డిఎప్పీ భాస్కర్రెడ్డి, సిఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పాపన్నపేట ఎస్ఐ నాగేశ్వర్రావు, సిబ్బంది గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఏడుపాయల జాతరకు తరలి వచ్చే భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పాలక మండలి చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఇవో మోహన్రెడ్డి, డైరెక్టర్లు వెంకటామాగౌడ్, రాంచెందర్, కిషన్రెడ్డి, రామకిష్టయ్య, రామప్ప దావిద్, శారదాబాయి, రమేశ్, చిన్నబర్నయ్యలతో పాటు పాలక ఆలయ సిబ్బంది సేవలందిస్తున్నారు.