చెన్నైచేరిన రెహ్మాన్ కు జయహో
ఆయనకు తమిళనాడు ప్రభుత్వం తరపున సమాచారమంత్రి ఆయనకు స్వాగతం పలకగా డ్రమ్మర్ శివమణి తన ట్రూప్తో సంగీత స్వాగతం పలికి బయటకు తీసుకువచ్చారు. ఆయనకోసం అర్థరాత్రినుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు బయట వేచి ఉన్నారు. ఆయన రాగానే ఆయనపై పుష్పవర్షం కురిపించారు. జయహో అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అభిమానులు, మీడియావారు ఆయనను చుట్టుముట్టి కదలటానికి వీల్లేని పరిస్థితి కల్పించారు. ఓ దశలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. పోలీసులు అదుపుచేశారు.
తనకు అవార్డు వస్తుందని, రావాలని తనకంటే ఎక్కువ ప్రజలు కోరుకున్నారని వారి అభిమానమే అవార్డుల రూపంలో ఫలించిందని రెహ్మాన్ అన్నారు. అక్కడినుంచి ఆయన కోడంబాకంలోని స్వగృహానికి చేరుకున్నారు. ముంబయి విమానాశ్రయంలో రసూల్ పోకుట్టి, నటుడు ఇర్ఫాన్ ఖాన్లకు ఘనస్వాగతం లభించింది. అభిమానులు పూలమాలలతో వారిని ముంచెత్తారు. ఆస్కార్ను పైకెత్తి చూపుతూ వారు తమకు లభించిన స్వాగతం అపూర్వమని అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మైల్పింకీ టీమ్కు కూడా ఘనస్వాగతం లభించింది.