'మహా' గర్జన రద్దు
హైదరాబాద్:ఈ నెల 9వ తేదీన సికింద్రాబాదులోని పెరేడ్ గ్రౌండులో జరగాల్సిన మహాగర్జన బహిరంగ సభను మహాకూటమి రద్దు చేసుకుంది. ఏర్పాట్లకు సమయం సరిపోవటంలేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహా కూటమి నాయకులు తెలిపారు. శనివారంనాడు హైదరాబాద్లో నిర్వహించిన సోనియా బహిరంగ సభ పేలవంగా ఉందని అభిప్రాయపడిన కూటమి నేతలు..'మహా' గర్జన మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని తీర్మానించారు. సోనియా గాంధీ సభ జరిగిన పెరేడ్గ్రౌండ్స్లో ఈ సభ నిర్వహణ అనవసరమని భావించిన నేతలు..ఇందుకోసం హైదరాబాద్ చుట్టుపక్కల జాతీయ రహదారుల పక్కన విశాలమైన స్థలం కోసం ఆదివారం వేట మొదలు పెట్టారు. ఇక ఈ సభను చూసినవారు వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని తీర్మానించుకునేలా నాలుగు పార్టీల కేడర్ శక్తివంచన లేకుండా కృషి చేయాలని నిశ్చయించారు. అయితే అనుకోని పరిస్ధితుల్లో సభ రద్దవటం పార్టీ శ్రేణులను కొంత వరకూ నిరాశపరుస్తోంది.