ప్రజారాజ్యం ఓ కాపీ స్టోరీ!
హైదరాబాద్: ప్రజారాజ్యం మేనిఫెస్టోలో కొత్త విషయాలు పెద్దగా లేవు. మూడేళ్ళలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ అది ఎలా ఆచరణ సాధ్యమవుతుందో చెప్పలేదు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను ప్రకటించింది. సామాజిక న్యాయాన్ని సాధిస్తామని పేదలు, ధనవంతుల మధ్య అంతరాలు తగ్గించటమే సామాజిక న్యాయమని అందులో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ను కొనసాగిస్తామన్నారు. రైతులకు వ్యవసాయంకోసం 10 గంటలపాటు విద్యుత్ను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. రైతులందరికీ పెన్షన్,భీమా పథకాలు ప్రవేశపెడతామని తెలిపారు. నీటి తీరువాను వసూలుచేయమని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ను అందరికీ అందిస్తామని అన్నారు.
ప్రతిభకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. దశలవారిగా మద్యనిషేధాన్ని అమలుచేస్తామని, తెల్లకార్డు ఉన్నవారికి 100 రూపాయలకే వంటసరుకులు ఇస్తామని ప్రకటించారు. ఆడపిల్లలకు పసుపుకుంకుమ పథకం ప్రవేశపెడతామన్నారు. చేనేత కార్మికులకోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేస్తామని కూడా తెలిపారు. మూడేళ్లలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఐటీ కంపెనీలకు అసంబద్దంగా ఇచ్చిన సెజ్లు రద్దుచేస్తామన్నారు. ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు కోరతామని తెలిపారు.