ఎనీ సెంటర్ రెడీ: బాలయ్య
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బాలకృష్ణ ఎన్నికల ప్రచారయాత్రను ఆదివారం ఉదయం 9.10 గంటలకు బాలకృష్ణ చైతన్యరథం ఎక్కి ప్రారంభించారు. ఈనెల12వరకూ నెల్లూరు జిల్లాలో పర్యటించి 16నుంచి 20వరకూ ప్రకాశం జిల్లా పర్యటనను చైతన్యరథంపై బాలకృష్ణ నిర్వహిస్తారు.
రెండో విడత నెల్లూరి జిల్లా తడ నుంచి మొదలు అవుతున్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా చైతన్యరథం రెడీ చేసారు. పలు ప్రత్యేక సౌకర్యాలతో అధునాతన ఆడియో సౌకర్యంతో రూపొందించిన చైతన్య రథానికి విజయవాడలోని బెంజిసర్కిల్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం బాలకృష్ణ మిత్రులు కాళేశ్వరి ట్రావెల్స్ అధినేత చలసాని రవి, చలసాని తేజ, బొర్రా గాంధీ ప్రత్యేకపూజలు నిర్వహించారు. హైదరాబాద్లో స్వరాజ్మజ్దా వాహనాన్ని పసుపురంగుతో అలంకరించి బాలయ్య బొమ్మలు ముద్రించారు.
రథంలో పార్టీ నియోజకవర్గ ముఖ్యనేతలతో చర్చించేందుకు రెండు సోఫాసెట్లు కూడా ఏర్పాటుచేశారు. చైతన్యరథం నుంచి బాలకృష్ణ ప్రసంగించేందుకు అధునాతన డిజిటల్ ఆడియో సౌకర్యం కల్పించారు. ప్రత్యేక జనరేటర్, ఎయిర్ కండిషన్ సౌలభ్యంతో ఏర్పాటుచేసిన ఈ చైతన్యరథాన్ని హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం విజయవాడ బెంజిసర్కిల్కు తీసుకొచ్చారు. కేశినేని ట్రావెల్స్ అధినేత నాని, కాట్రగడ్డ బాబు, ఎల్. భాస్కరరావు చైతన్యరథాన్ని పరిశీలించారు. ఆదివారం ఉదయం ఈ రథాన్ని బాలకృష్ణ మిత్రులు గాంధి తదితరులు నెల్లూరుకు తీసుకెళ్ళారు.