నిమ్స్ వైద్యుల సమ్మె, రోగుల ఇక్కట్లు
హైదరాబాద్: తమకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సామూహిక సెలవులు పెట్టుకున్న నిమ్స్ వైద్యులు ఈరోజు నుంచి సమ్మెకు దిగారు. వారు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనటంతో వైద్యసేవలు స్తంభించాయి.
నిమ్స్ ఫ్యాకల్టీ వైద్యుల సమస్య జఠిలంగా మారుతోంది. యజమాన్యం మొండి వైఖరి, వైద్యుల పట్టుదల సమ్మెకు దారితీసింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నిమ్స్లో ఓపీ, ఓటీ సేవలకు దూరంగా ఉండాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే అత్యవసర సేవలు అందిస్తామని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగదని వైద్యుల సంఘం ప్రకటించింది. కాగా నిమ్స్లో 'ఎస్మా' అమలులో ఉందని, సమ్మెలు, ఆందోళనలు చేపట్టరాదని యాజమాన్యం బెదిరిస్తోంది.
ఇప్పటికే ఫ్యాకల్టీ లాంజ్ను మూసివేసిన యాజమాన్యం ఇప్పుడు డాక్టర్లకు వ్యక్తిగత లేఖలతో బెధిరింపులకు పాల్పడుతోందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఆగేదిలేదని, సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. యాజమాన్యం తమకు అనుకూలంగా వ్యవహరించకపోవడంవల్లే సోమవారం నుంచి నుంచి ఓటీ, ఓపీ, ల్యాబోరేటరీ సేవలు నిలిపివేస్తున్నామని నిమ్స్ ఫ్యాకల్టీ డాక్టర్లు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. ఆరో పీఆర్సీ విషయంలో తమకు రావాల్సిన ఆదాయాన్ని సైతం వదులుకున్నా తమకు న్యాయబద్ధంగా అందాల్సిన పీఆర్సీ, బకాయిలను చెల్లించడానికి యాజమాన్యం, త్రిసభ్యకమిటీలు తమను వంచన చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఎయిమ్స్ ఆస్పత్రిలోనే కాక దేశంలో అన్ని సర్వీసుల్లో 1జనవరి 2006 నుంచి పీఆర్సీ అమలు చేస్తే తమకు మాత్రం 1 జనవరి 2009 నుంచి విడుదల చేస్తానంటున్నారని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందనలేదన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే అదనపు ఆదాయం, సాయంత్ర క్లినిక్ల ద్వారా వచ్చే 15శాతం ఆదాయాన్ని సైతం వదులుకున్నా యాజమాన్యం తమకు అనుకూలంగా వ్యవహరించడంలేదన్నారు. త్రిసభ్యకమిటీకి తప్పుడు సమాచారాన్ని అందించి తమకు బకాయిలు చెల్లించకుండా చేస్తున్నారని ఆరోపించారు.