కేసినేని నాని కోవర్టే: చిరంజీవి
రాజమండ్రి: కొందరు తమ ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి చేరి, తర్వాత ఆరోపణలు చేసి తమదైన పార్టీల్లో చేరడం మామూలైపోయిందని ఆ పార్టీ అధినేత చిరంజీవి బుధవారం ఉదయం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ట్రావెల్స్ యజమాని కేసినేని నాని ఇటీవల ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజీమానా చేసి, చిరంజీవి కుటుంబసభ్యులపై విమర్శలు చేసి మొన్న తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ప్రజారాజ్యం పార్టీ టికెట్ల కోసం కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలను ఒక విలేకరి చిరంజీవి దృష్టికి తేగా ఆయన తీవ్రంగా స్పందించారు. కొత్త పార్టీని, ప్రజల ఆదరణ బాగా ఉన్న పార్టీని దెబ్బతీయడానికి ఇటువంటి ప్రచారాలతో ప్రత్యర్ధులు ప్రయత్నించడం మామూలేనని, ఈ ప్రచారాలు కూడా అందులో భాగమేనని ఆయన అన్నారు.
రాజమండ్రి బహిరంగ సభలో తన ఫ్యాన్స్ గోల చేశారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. బహిరంగ సభకు వచ్చిన ఐదు లక్షల మంది తన అభిమానులేనని ఆయన అన్నారు. అభిమాన సంఘాల్లో ఉండే కొన్ని వందల మంది మాత్రమే తన అభిమానులు కారని, రాష్ట్రంలో ఉన్న లక్షలాది కోట్లాది మంది తన అభిమానులేనని ఆయన అన్నారు.