ర్యాగింగ్ కి ఇంజనీరింగ్ స్టూడెంట్ బలి
గుంటూరు: ర్యాగింగ్ రాక్షసి మరో సారి ఓ అమ్మాయిపై తన విశ్వరూపం చూపించింది. ఆ క్రమంలో తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కారణం సీనియర్ విద్యార్థినుల ర్యాగింగే అంటూ రాత పూర్వకంగా తేల్చి చెప్పింది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం వూర్లాం గ్రామానికి చెందిన నడిమింటి త్రివేణి(19) బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం అగ్రికల్చరల్ బిటెక్ చదువుతోంది. హాస్టల్లో చేరిన ఆమెను నాలుగు నెలల నుంచి సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు తెలియపర్చింది. వారు కొద్దిగా ఓదార్చారు కానీ చర్య తీసుకోలేదు.
ఇక గత నెలలో మొదటి సెమిస్టర్ పరీక్షల అనంతరం తన స్వగ్రామం వెళ్ళిన త్రివేణి తిరిగి 24వ తేదీ హాస్టల్కు చేరుకుంది. మళ్ళీ తీవ్ర స్ధాయిలో ర్యాగింగ్ జరిగింది. దాంతో 25వ తేదీన ఇంటికి ఫోన్ చేసి ఆ విషయం గురించి కంప్లైంట్ చేసింది. ఏమన్నారో ఏమో గానీ తట్టుకోలనే స్ధితిలో 27వతేదీ రాత్రి వాస్మాల్ 33 ఆయిల్ను సేవించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. వెంటనే కళాశాల ప్రిన్సిపల్, మరికొందరు విద్యార్థినులు ఆమెను అమరావతి ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న ఆమె సోదరుడు శ్రీనివాస్, బాబాయి అప్పలనాయుడు మరుసటి రోజు గుంటూరు చేరుకున్నారు.
కోమాలోకి వెళ్ళిన త్రివేణి చికిత్స పొందుతూ పది రోజుల అనంతరం కోమా నుంచి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన కారణాన్ని వెల్లడించింది. ర్యాగింగ్కు పాల్పడిన వారి పేర్లను గురువారం కాగితాలపై రాసి వెల్లడించింది. రెండో సంవత్సరం విద్యార్థినులు నజ్మ, సాహిత్యలు, 3వ సంవత్సరం విద్యార్థినులు స్రవంతి, సౌజన్య, వనితలు ర్యాగింగ్కు పాల్పడిన తనను మానసిక క్షోభకు గురిచేశారని తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి, తండ్రులు దాంతో తన కూతురు త్రివేణికి న్యాయం చేయాలని, ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థినులపై తగిన చర్యలు తీసుకొని తమకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే ఉద్యమాలు చేపడతామని ఆమె బాబాయి అప్పలనాయుడు మీడియా ముందు హెచ్చరించారు.