మేఘాలయలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: మేఘాలయలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అక్కడ ఎన్సీపీ నాయకత్వంలోని డొంకూపర్ రాయ్ ప్రభుత్వానికి 5గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించటంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించారు. ఆ సమయంలో స్పీకర్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వని ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించకుండా తన ఓటుతో ప్రభుత్వాన్ని గట్టెక్కించారు.
స్పీకర్ చర్యపై విపక్షాలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. వారి వాదనలోని వాస్తవాన్ని అంగీకరించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే శక్తి ఏ పార్టీకి లేనందున రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. దీనిపై చర్చించిన మంత్రిమండలి ఇందుకు ఆమోదాన్ని తెలిపింది. మంత్రిమండలి తన ఆమోదాన్ని రాష్ట్రపతికి పంపిన అనంతరం రాష్ట్రపతి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.