శవాలు రప్పించే యత్నంలో సిఎం పేషీ
అమెరికాలోని సెయింట్ లూయిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన మరో యువకుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విదేశీ చదువులు చదివి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్షతో విజయవాడ తులసీనగర్కు చెందిన చింతా సత్య సుభాకర్ (25), యనమలకుదురుకు చెందిన ముప్పవరపు ప్రియదర్శిని (22), ఎనికేపాడుకు చెందిన అనుమోలు అనూష (23), గాజువాకకు చెందిన వీరపనేని అనితాలక్ష్మి (23), విశాఖ నగరానికి అడుసుమిల్లి నితీష్ (27) అమెరికా వెళ్లారు.
వీరిలో అనితాలక్ష్మి, ప్రియదర్శిని, అనూష షికాగోలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ కోర్సు చేస్తున్నారు. సుభాకర్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు. నితీష్ రెండేళ్లుగా ఎం డాక్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. గతనెల 19వ తేదీన నితీష్కు, అనితాలక్ష్మికి వివాహ నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహానికి త్వరలోనే ముహూర్తాలు పెట్టాలని పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, లండన్లో ఉంటున్న యువకుడితో ముప్పవరపు ప్రియదర్శినికి గతనెల 14నే పెళ్లి సంబంధం కుదిరింది. వీరికి మేలో వివాహం జరగాల్సి ఉంది. అయితే..వీకెండ్ సందర్భంగా సెయింట్ లూయిలో ఉన్న నితీష్ కాబోయే భార్య అనితాలక్ష్మితోపాటు ఆమె మిత్రులను డిన్నర్కు ఆహ్వానించాడు.
దీంతో వీరంతా అక్కడికి వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని, రాత్రి ఓ హోటల్లో డిన్నర్ ముగించి తిరిగి కారులో ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో..సన్ సెట్ హిల్స్ పోలీసు డిపార్ట్ మెంట్కు చెందిన క్రిసీ మిల్లర్(41) పోలీసు వాహనంలోనే తాగిన మైకంలో రాంగ్ రూట్లో దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న వీరి కారును బలంగా ఢీకొట్టారు. దీంతో కారు ఉన్న అనితా లక్ష్మి, ప్రియదర్శిని, సత్య సుభాకర్, అనూష అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవ్ చేస్తున్న నితీష్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయనను సెయింట్ లూయి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో మరణించిన నలుగురూ ఆ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోలేదని సెయింట్ లూయి పోలీసులు వెల్లడించారు.