బాబును చూసి జాలేసింది: వైయస్
చిరంజీవి రాజకీయాల్లోకి రాగానే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా మాట్లాడారని, చిరంజీవి పరిస్థితి అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు తన బావ మరిదిని, పెద్ద బావ మరిది కుమారులను ప్రచారంలోకి దింపారని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పే మాటలకు ప్రజల్లో విశ్వసనీయత లేదని, అందుకే చంద్రబాబు సినీ నటులను ప్రచారంలోకి దింపారని ఆయన విమర్శించారు.
తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు చిత్తశుద్ధి లేదని, కెసిఆర్ కు చిత్తశుద్ది ఉండి ఉంటే తెలంగాణ సమస్య పరిష్కారమై ఉండేదని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం రాగానే రెండో ఎస్సార్సీకి కెసిఆర్ అంగీకరించి ఉంటే తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు చూస్తారని, కాంగ్రెసు పార్టీకే చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. తాము తెలంగాణలో 80కి పైగా శాసనసభా స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర, రాయలసీమల్లో 150కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆయన అన్నారు.
కాంగ్రెసు బలహీనపడిందని ఈనాడు దినపత్రిక కూడా రాయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. సర్వేలపై వార్తాకథనం రాస్తూ చాలా కష్టపడ్డారని, అయినా కాంగ్రెసు బలహీన పడిందని రాయలేకపోయారని ఆయన అన్నారు. తాము పార్టీ టికెట్ల పంపకంలో దళితులకు అన్యాయం చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. గెలుపు అవకాశాలను ప్రధాన కొలమానంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని, దీంతో చాలా మంది సిట్టింగ్ శాసనసభ్యులకు సీట్లు రాలేదని ఆయన అన్నారు. టికెట్ల పంపకంలో సామాజిక న్యాయం పాటించామని ఆయన చెప్పారు.