వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును చూసి జాలేసింది: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
తాండూరు: టీవీల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖం చూస్తే జాలేసిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖం ఇంత కళావిహీనంగా ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. తాము నామినేషన్ల పర్వం ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందే శాసనసభ, లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశామని, ఇటువంటి పరిస్థితి తనకు తెలిసి కాంగ్రెసులో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. తాము ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తే మిగతా పార్టీలు ఇంకా పూర్తి చేయలేకపోతున్నాయని, చంద్రబాబు పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన గురువారం తాండూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

చిరంజీవి రాజకీయాల్లోకి రాగానే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా మాట్లాడారని, చిరంజీవి పరిస్థితి అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు తన బావ మరిదిని, పెద్ద బావ మరిది కుమారులను ప్రచారంలోకి దింపారని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పే మాటలకు ప్రజల్లో విశ్వసనీయత లేదని, అందుకే చంద్రబాబు సినీ నటులను ప్రచారంలోకి దింపారని ఆయన విమర్శించారు.

తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు చిత్తశుద్ధి లేదని, కెసిఆర్ కు చిత్తశుద్ది ఉండి ఉంటే తెలంగాణ సమస్య పరిష్కారమై ఉండేదని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం రాగానే రెండో ఎస్సార్సీకి కెసిఆర్ అంగీకరించి ఉంటే తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు చూస్తారని, కాంగ్రెసు పార్టీకే చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. తాము తెలంగాణలో 80కి పైగా శాసనసభా స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర, రాయలసీమల్లో 150కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆయన అన్నారు.

కాంగ్రెసు బలహీనపడిందని ఈనాడు దినపత్రిక కూడా రాయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. సర్వేలపై వార్తాకథనం రాస్తూ చాలా కష్టపడ్డారని, అయినా కాంగ్రెసు బలహీన పడిందని రాయలేకపోయారని ఆయన అన్నారు. తాము పార్టీ టికెట్ల పంపకంలో దళితులకు అన్యాయం చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. గెలుపు అవకాశాలను ప్రధాన కొలమానంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని, దీంతో చాలా మంది సిట్టింగ్ శాసనసభ్యులకు సీట్లు రాలేదని ఆయన అన్నారు. టికెట్ల పంపకంలో సామాజిక న్యాయం పాటించామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X