రాష్ట్రంలో నేతల ప్రచార హోరు
హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచార హోరు గురువారం నుంచి ప్రారంభమైంది. అభ్యర్థుల ఎంపికలో ముందున్న కాంగ్రెసు పార్టీ తన ప్రచారాన్ని కూడా చాలా ముందుగానే ప్రారంభించింది. తనకు అచ్చి వచ్చే చేవెళ్ల నుంచి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికే మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. గురువారంనాడు ఆయన పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి నామినేషన్ వేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో పులివెందులకు బయలుదేరి వెళ్తారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రేపటి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఎం, సిపిఐలతో సీట్ల సర్దుబాటులో తీవ్ర ఇబ్బందులకు గురైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం తన ప్రచారాన్ని మేడ్చల్ నుంచి ప్రారంభిస్తారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన బుధవారం తిరుమలేశుని సందర్శించుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం ఆయన మేడ్చల్ కు బయలుదేరి వెళ్తారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురువారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆయన గోదావరిఖనిలోని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున సినీ నటుడు బాలకృష్ణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉత్తారంధ్రలో పర్యటించారు. తిరిగి ఆయన ఈ నెల 15 లేదా 16వ తేదీ నుంచి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఉభయ గోదావరి జిల్లాల్లో తన పర్యటనను సాగిస్తున్నారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. తెలంగాణపై ఆశలు వదులుకున్న చిరంజీవి కోస్తాలో ప్రధానంగా తన దృష్టిని కేంద్రీకరించాలని అనుకుంటున్నట్లు సమారం.