రైలింజన్ పై 9 వరకు సస్పెన్స్
న్యూఢిల్లీ: రైలింజన్ గుర్తు తమదేనంటూ రాష్ట్రీయ క్రాంతికారీ సమాజ్వాది పార్టీ(ఆర్కేఎస్పీ) దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్కు, ప్రజారాజ్యం పార్టీకి నోటీసులు జారీచేసింది. ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆర్కేఎస్పిీ పిటిషన్పై విచారణను ప్రారంభించింది. ఈనెల 9న దీనిపై తుది విచారణ జరుగుతుంది. ఆ రోజే తీర్పు వెలువడ వచ్చు.
తొమ్మిదవ తేదీలోగా నోటీసులకు ఈసీ సమాధానమివ్వాలని ఆదేశించింది. తమది గుర్తింపు పొందని జాతీయ పార్టీ అని..ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఉనికి ఉందని పిటిషన్లో ఆర్కేఎస్పీ పేర్కొంది. గతంలో తమ అభ్యర్థులు రైలింజన్ గుర్తుపై పోటీ చేసినందున దాన్ని మరెవ్వరికీ ఇవ్వొద్దని కోరింది.
రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు ఒకే గుర్తు కోసం పోటీపడినప్పుడు లాటరీ పద్ధతి ద్వారానే గుర్తులను కేటాయించాలన్న నియమాన్ని పాటించాలని పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోతగి వాదించారు. అయితే దురుద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ను దాఖలు చేశారని పీఆర్పీ న్యాయవాది దత్తా పేర్కొన్నారు.