కాంగ్రెసులో దావూద్ ఇంబ్రహీంకి..
హైదరాబాద్: భవిష్యత్తులో నేతలెవరైనా దావూద్ ఇబ్రహీంను తీసుకువచ్చినా సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేస్తారా? అని ముఖ్యమంత్రి వైఎస్ను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ఎఐసీసీ కార్యదర్శి వి.హన్మంత రావు నిలదీశారు. అంబర్పేట శంకర్ వంటి రౌడీలను పార్టీలో చేర్చుకోవడంతో వైఎస్ ఇమేజ్ పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వెళ్ళగక్కారు.
పార్టీల్లో రౌడీషీటర్లను చేర్చుకోకుండా నిషేధించాలని శనివారం ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకుడు ఎవరో తీసుకువచ్చాడని, అందుకే కండువా వేశానని వైఎస్ చెప్పడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అందరూ తూతూ అంటున్నారు..(మీ వెంట) నాలుగు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నప్పుడు రౌడీలు ఎందుకు అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పార్టీకి చెందిన వెనుకబడిన నేతలను హత్య చేసిన వ్యక్తిని కాంగ్రెస్లో చేర్చుకుని ఇప్పుడు ఓట్లెలా అడుగుతారని బస్తీలోని మహిళలు నిలదీస్తుంటే వారికి ఏం సమాధానం చెప్పాలి!? అసలు నేరచరిత్ర కలిగిన రౌడీలు సీఎం క్యాంపు కార్యాలయంలోకి వస్తుంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? రౌడీలు సీఎం కార్యాలయంలోకి నేరుగా వస్తుంటే నిఘా విభాగాలు ముందస్తు హెచ్చరికలను ఎందుకు చేయలేదు.
కాంగ్రెస్లో చేరతామంటూ ఉగ్రవాదులు వచ్చినా నిఘా విభాగాలు ఇలాగే వ్యవహరిస్తాయా!? బహిరంగ సభలకు వచ్చిన మహిళల నుంచి రాజీవ్గాంధీ పూలదరలు స్వీకరించేవారు. ఆ అలవాటే చివరికి శ్రీపెరంబదూర్లో ఆయనను పొట్టన పెట్టుకుంది. అలాగే..రౌడీలు, నేరచరితులకు పార్టీ కండువా వేసే సమయంలో మీటనొక్కి బెల్టుబాంబు పేలిస్తే వైఎస్ ఏమవుతారో!? అని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ భద్రతను అసలు నిఘా విభాగాలు పట్టించుకుంటున్నాయా అని నిలదీశారు.