"ప్రజారాజ్యం ఓనర్లకు కల్పవృక్షం"
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ ఓనర్ల కల్పవృక్షమని ప్రజలకు మాత్రం విషవృక్షమని ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత పరకాల ప్రభాకర్ అన్నారు. ఆ పార్టీ ఓ కంపెనీ అని దానికి ఓనర్లు తప్ప అధ్యక్ష కార్యదర్శులు లేరని అన్నారు. వారికి డబ్బే లక్ష్యమని అందుకు సీట్లే మార్గమని అన్నారు. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వలేదని పార్టీని వదిలానని, సామాజికన్యాయం అంటే కడుపుమంటతో ఆరోపణలు చేశాననిఅల్లు అరవింద్ అన్నారని అందుకే వివరణ ఇస్తున్నానని ఆయన అన్నారు.
తాను మౌఖికంగా గాని లిఖితపూర్వకంగా గాని ఎవరినీ టిక్కెట్ అడగలేదని తనకు ఆ అవసరం లేదని అన్నారు. అల్లు అరవింద్ అనకాపల్లిలో, రామచంద్రయ్య మచిలీపట్నంలో గెలుస్తారని ఏ సర్వే చెప్పిందని అన్నారు. చిన్నపిల్లలను అమ్ముకున్నవారు, గంటల వ్యవధిలో పార్టీలో చేరి టిక్కెట్లు తెచ్చుకున్నవారు గెలుస్తారని ఏ సర్వే చెప్పిందని ఆయన ప్రశ్నించారు. తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని హరిరామజోగయ్య అన్నారని తనపై ఒకే ఒక కేసు నడవగా దాన్ని కోర్టు కొట్టివేసిందని ఇంకా తనను అలా అంటే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అన్నారు.