టిడిపి అభ్యర్థి రేవంత్ పై కాంగ్రెస్ దాడి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా లోని హుస్నాబాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై బుధవారం దాడి జరిగింది. కోడంగల్ మండలం హుస్నాబాద్లో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై జడ్పీ వైస్ఛైర్మన్ కృష్ణ అనుచరులు దాడి చేశారు. దీంతో రేవంత్ రెడ్డి గాయపడ్డారు. ఆయన కారు ధ్వంసమైంది. ఆయన గన్ మెన్లు కూడా కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
తనపై దాడికి నిరసనగా రేవంత్ రెడ్డి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. భద్రతా సిబ్బందితో రేవంత్ రెడ్డి తమ కార్యకర్తలపై దాడి చేయించారని కాంగ్రెస్ శాసనసభ్యుడు, అభ్యర్థి గుర్నాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో తన కుమారుడు గాయపడినట్లు ఆయన చెబుతున్నారు. పథకం ప్రకారం తన సెక్యూరిటీని తగ్గించి తనపై దాడి చేయించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వైస్ చైర్మన్ కృష్ణను, గుర్నాథ్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.