రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావం ఉందని భావిస్తున్న ఉత్తరాంధ్రలోనూ, ఉత్తర తెలంగాణలోనూ అవాంఛనీయమైన సంఘటనలేవి జరగలేదు. పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ లో మాత్రం నక్సల్స్ హింస కొనసాగుతోంది. గురువారం 11 గంటల వరకు రాష్ట్రంలో 25.67 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (సిఇవో) ఐవి సుబ్బారావు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రాల్లో తప్ప ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన గురువారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
గల్లంతైన ఓట్లపై ఈసారి ఏమీ చేయలేమని ఆయన చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా 32 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యల్పంగా 19.2 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వని సంస్థలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సుబ్బారావు చెప్పారు. ఐజాలోని సంఘటనను కేంద్ర ఎన్నికల కమిషనుకు తెలియజేశారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది.