ప్రచారానికి తెర: నేతలకు పరీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెర పడింది. పోలింగ్ సక్రమంగా జరగడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 141 శాసనసభా నియోజకవర్గాలకు, 20 లోకసభ స్థానాలకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాయలసీమ ముఠా కక్షలకు పేరు పడడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
మూడు ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా రెండో దశ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లోంచే పోటీ చేస్తుండడం విశేషం. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పాలకొల్లు నుంచే కాకుండా తిరుపతి నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
తొలి దశ తెలంగాణ, ఉత్తారంధ్రలో పోలింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల అగ్రనేతలు రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం సాగించారు. ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు వంటి జిల్లాల్లో నేతలు ఒక్కటికి రెండు సార్లు పర్యటించారు. రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉండడం, చిరంజీవి ప్రభావం ఎక్కువగా ఉండడం వైఎస్ ను, చంద్రబాబును కూడా కలవరపెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే సమయంలో వైఎస్ తెలంగాణపై చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో జత కట్టిన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాయలసీమకు జరిగే నష్టాన్ని వైఎస్ వివరించారు. హైదరాబాదుకు మనం విదేశీయులం అవుతామని, పోతిరెడ్డి పాడు ఎండిపోతుందని, తదితర వ్యాఖ్యలు ఆయన చేశారు. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పలువురు మంత్రులు పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితులైన రఘువీరారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, గల్లా అరుణకుమారి వంటి మంత్రులు పోటీలో ఉన్నారు.