పోలింగ్: పలు చోట్ల ఘర్ణణలు
హైదరాబాద్: రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ సందర్భంగా గురువారం పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగినట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు చెప్పారు. రేపల్లెలో మంత్రి మోపిదేవిని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యప్రసాద్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఘర్షణలు పెరుగుతున్నాయని సుబ్బారావు కూడా అంగీకరిస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 15 చోట్ల ఇవియంలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా పేరాయవాని పాలెంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కృష్ణా జిల్లా గౌరవరం గ్రామంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెసు అభ్యర్థి ఉదయభాను తండ్రి కారును ధ్వంసం చేశారు.
కర్నూలు జిల్లా నందిపాడులో పివో లేక పోలింగ్ ప్రారంభం కాలేదు. చిత్తూరు జిల్లా తోట సముద్రం గ్రామంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు సామాజిక వర్గాలు పర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నట్లు అదనపు డిజిపి ఖానే చెప్పారు. ప్రకాశం జిల్లా తోటవారిపాలెంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో పోలింగును నిలిపేశారు. కడప జిల్లా చలకాంపల్లిలో రిగ్గింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కృష్ణా జిల్లా బ్రాహ్మణపట్లపాలెంలో కాంగ్రెసు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతపురం జిల్లాలో కూడా పలు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.