అమలాపురంలో ఇంకా ఉద్రిక్తత
అమలాపురం: అమలాపురం పట్టణంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్-పీఆర్పీల మధ్య రగిలిన విద్వేషాగ్ని ఇంకా చల్లారలేదు. అమలాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులు మోహరించారు. శనివారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చారుపిన్హా ఇరు వర్గాల మధ్య శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో శనివారం నుంచి పట్టణంలో సాధారణ పరిస్థితి రావచ్చునని అంతా భావిస్తున్నారు.
అమలాపురం పట్టణంలో గురువారం రాత్రి నుంచీ నరాలు తెగే ఉత్కంఠ ఉంది, ఈ పరిస్థితితో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పచ్చని కోనసీమలో రగిలిన చిచ్చు ఆరలేదు..ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. గురువారం రాత్రి పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు వైఖరి కారణంగా తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చి కాంగ్రెస్ ఎంపీ జీవీ హర్షకుమార్ క్యాంపు కార్యాలయంపై రాళ్లతో దాడి చేసిన సంఘటన శుక్రవారం రాత్రి వరకూ ఉద్రిక్తతలకు కారణమైంది.