ప్రభాకరన్ ఉగ్రవాది కారు: రాందాస్
చెన్నై : ఎల్టీటీఈ అధినేత ఉగ్రవాది కాదని పట్టల్ మక్కలి కచ్చి (పిఎంకె) పార్టీ అధినేత రాందాస్ అన్నారు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఆయన పోరాడుతున్నారని ఆయన చెప్పారు. తమ ప్రజల హక్కుల కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్, నెల్సన్ మండేలా, పాలస్తీనా ఉద్యమనేత ఆరాఫత్లను కూడా ఒకప్పుడు ఉగ్రవాదులని ముద్రవేశారని ఆయన అన్నారు. శ్రీలంక అంశంలో ఏ మాత్రం ఆలస్యంచేయకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీలంక ప్రభుత్వ దాడులను ప్రోత్సహించడం ద్వారా భారత ప్రభుత్వం కూడా తమిళులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళ ఈలం ఏర్పాటు మాత్రమే సమస్యకు పరిష్కారమని అన్నాడియంకె నేత జయలలిత శనివారంనాడు అన్నారు. సమస్య పరిష్కారం కోసం శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేతో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం శుక్రవారం జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్, విదేశీ కార్యదర్శి శివశంకర్ లను పంపింది.