రాష్ట్రంలో రీపోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్: రాష్ట్రంలోని పది జిల్లాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రకాశం జిల్లా లో మొదటి గంటన్నరలో 5 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక్కడ రీపోలింగ్ జరుగుతున్న 11 కేంద్రాల్లో ఉన్నతాధికారులు దగ్గరుండి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా రీపోలింగ్ మందకొడిగా సాగుతోంది.
మలివిడత ఎన్నికల్లో అవాంతరాల దృష్ట్యా ఈరోజు 10 జిల్లాల్లోని 63 పోలింగ్కేంద్రాల్లో ఆదివారం రీపోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలో అత్యధికంగా 21 చోట్ల రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ సజావుగా జరిగేందుకు అదనపు బలగాలతో పాటు ప్రతి పోలింగ్కేంద్రం వద్ద సీనియర్ అధికారులను నియమించారు. కడపలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ, వీడియో కెమెరాలు ఏర్పాటుచేశారు.
రీపోలింగ్ జరుగుతున్న 23 కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు నమోదైన పోలింగ్శాతాలను ఎన్నికల కమిషనర్ సుబ్బారావు తెలిపారు. సరాసరిన 20 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో 15 శాతం, నెల్లూరు 27 శాతం, కర్నూలు 13 శాతం, అనంతపురం 15 శాతం, చిత్తూరు 25 శాతం, పులివెందుల 16 శాతం, కడపలో 17 శాతం, కర్నూలులో 15 శాతం, మైదుకూరులో 12 శాతం, తూ.గోలో 26 శాతం, పశ్చిమగోదావరిలో 20 శాతం, గుంటూరులో 14 శాతం, కృష్ణా జిల్లాలో 20 శాతం పోలింగ్ నమోదైందని సుబ్బారావు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన తెలిపారు.