సింహాద్రి అప్పన్న చందనోత్సవం
రాత్రి రెండు గంటలకు వెండి బొరిగెలతో స్వామివారి దేహంపైనున్న చందనాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ తొలగించారు. అనంతరం ప్రత్యేక ఆరాధన గావించి స్వామివారి ఎదపై, శిరస్సుపై రెండు చందనం ముద్దలను ఉంచి స్వామి తొలిదర్శనాన్ని తెల్లవారుజామున మూడున్నరకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, విజయనగరం రాజ వంశానికి చెందిన ఆనందగజపతిరాజు కుటుంబీకులకు కల్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సింహాద్రినాథునికి పట్టువ్రస్తాలు, చందనం సమర్పించిన అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ స్వామి వారి నిజరూప దర్శనం వుంటుంది. అనంతరం సహస్రఘటాభిషేకం చేపట్టి చందన సమర్పణ చేపడతారు. దీంతో స్వామి తిరిగి నిత్యరూపంలోకి వస్తారు.
తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. ఏడాదికి ఒకసారి జరిపే స్వామి వారి నిజరూప దర్శనం కోసం ఒరిస్సా, పశ్చిమబెంగాల్ నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.