చెన్నైలో రైళ్ల ఢీ: ఏడుగురు మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. చెన్నైలోని వ్యాసర్పాడిలో లోకల్ రైలు గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరిగింది. లోకల్ రైలు రాంగ్ రూట్ లో వెళ్లి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో లోకల్ రైలుకు చెందిన ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. గూడ్స్ రైలును ఢీకొనగానే లోకల్ రైలు బోగీల్లో మంటలు లేచాయి.
మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. క్షతగాత్రులను సమీపంలోని జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. లోకల్ రైలు చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి నిర్ణీత సమయం కన్నా ముందే బయలుదేరిందని, ఆ తర్వాత మూడు స్టేషన్లలోనూ ఆగలేదని తెలుస్తోంది. రైలును బయటివారు ఎవరో నడపడం వల్లనే ఇది జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం నలుగురు మరణించినట్లు, ఆరుగురు గాయపడినట్లు తొలుత సిపిఆర్వో నీలు ఇత్రా చెప్పారు.