పార్టీయేనా?: చిరుకు శివశంకర్ ప్రశ్న
హైదరాబాద్: పార్టీ ఎటు పోతోంది, ఇది రాజకీయ పార్టీలా ఉందా, ఎవరెవరికో సీట్లిచ్చారు, ఇలా అయితే ఎలా? అని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పి.శివశంకర్ బుధవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రశ్నించినట్లు సమాచారం. సమావేశం ప్రారంభంలోనే శివశంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చిరంజీవి జోక్యం చేసుకుని 'శివశంకర్ గారూ! ఆ విషయాలన్నీ నేను మీతో తర్వాత ప్రత్యేకంగా మాట్లాడతాను. ఇక్కడ వద్దు' అని వారించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత మరో నేత పుట్టపాగ రాధాకృష్ణ సైతం ఇదే ధోరణిలో మాట్లాడినట్టు తెలిసింది.
పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చిన మిత్రా బుధవారం పెదవి విప్పారు. పార్టీలో తాను పోషించింది చిన్న పాత్రేనని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. మిత్రా లేకపోతే పార్టీయే లేదంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా "చిరంజీవికి నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞుడిని. మంచి మనసుతో ఆయన ఆ మాట అన్నారు. అయినా పార్టీలో నేను పోషించింది చిన్న పాత్రే. వ్యక్తులు పార్టీపై ఆధారపడాలి తప్ప, పార్టీ ఏ వ్యక్తిపైనా ఆధారపడకూడదు'' అని మిత్రా అన్నారు.