ఐదో నెంబర్ ప్రమాద స్ధాయికి స్వైన్ ఫ్లూ
జెనీవా: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంటువ్యాధి ప్రమాద స్థాయిని 5వ స్థానానికి పెంచింది. ప్రపంచవ్యాప్త అత్యంత తీవ్ర అంటువ్యాధి స్థానానికి కేవలం ఒకటే తక్కువ. కనీసం రెండు దేశాల్లో మనిషి నుంచి మనిషికి అంటువ్యాధి వ్యాపిస్తే అది 5వ స్థాయి కింద లెక్క. ఒక ఐదు సంవత్సరాల మెక్సికో చిన్నారి అమెరికాలోని టెక్సాస్లో ఈ వ్యాధితో మరణించడంతో ప్రమాదస్థాయిని పెంచారు. వ్యాధి పుట్టిన మెక్సికో బయట ఇదే తొలి స్వైన్ ఫ్లూ మరణం. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ మాట్లాడుతూ, వ్యాధి 5వ స్థాయికి చేరడమంటే అన్ని దేశాలు పూర్తిస్థాయిలో వ్యాధి నివారణకు సన్నద్ధంగా ఉండాలని సూచన అన్నారు. ఇది అన్ని దేశాల ప్రభుత్వాలకు, ఆరోగ్యశాఖలకు, ఫార్మా కంపెనీలకు, వ్యాపార, వాణిజ్య రంగాలకు తీవ్రస్థాయి హెచ్చరికగా పరిగణించాలని, ఆయా రంగాలు, శాఖలు సత్వరం తమ తమ విధుల్లో స్పందించాలని ఆదేశంగా వర్తిస్తుందని ఆమె ప్రకటించారు.
స్వైన్ ఫ్లూ నివారణకు ఆరోగ్యశాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కానీ వారి గమ్యస్ధానాలకు పంపించకూడదని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 148 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క అమెరికాలోనే 91కేసులున్నట్లు అమెరికాలోని వ్యాధుల నియంత్రణ-నివారణ కేంద్రం తెలిపింది. హెచ్1ఎన్1-2009గా పిలువబడుతున్న ఈ వ్యాధి జనించిన మెక్సికోలో ఐదు రోజులపాటు అన్ని రకాల పనులు, సేవలు రద్దు చేశారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఫెలిప్ కాల్డెరాన్ ప్రకటించారు.