డాడీ కాంగ్రెస్ లో చేరాల్సింది: త్రిషాలా
ముంబయి: తన డాడీ కాంగ్రెసులో చేరి తన తాత సునీల్ దత్ వారసత్వాన్ని కొనసాగించి ఉండాల్సిందని బాలీవుడ్ నటుడు, సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్ కూతురు త్రిషాలా అంటోంది. ఆమె సంజయ్ దత్ తీరు పట్ల, తన సవతి తల్లి మాన్యత పట్ల తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ లో చదువు పూర్తి చేసిన తర్వాత త్రిషాలాను ఇంటికి అహ్వానించి సంజయ్ దత్ కుటుంబాన్నిపరిపూర్ణం చేస్తానని మాన్యత చెప్పిన మాటలపై త్రిషాలా వ్యంగ్యంగా ప్రతిస్పందించింది. అది తన ఇల్లు అని, తన ఇంటికి తాను రావడానికి ఆహ్వానం అవసరం లేదని, తాను స్వతంత్రంగా ఉండగలనని భావించినప్పుడు తానే వస్తానని త్రిషాలా అంది.
పార్టీ ప్రచారంలో నిండా మునిగిపోయిన సంజయ్ దత్ నెల రోజులుగా త్రిషాలాతో మాట్లాడలేదు. రెండేళ్ల వరకు తాము చాలా సన్నిహితంగా ఉన్నామని, జరిగిన తప్పేమిటో కనిపెట్టడానికి ఇప్పటికే ఆలస్యం జరిగిందని, తమ సంబంధాల పట్ల తాను ఉద్వేగానికి గురి కావడం లేదన, తన డాడీ వైఖరే తనకు వచ్చిందని ఆమె అంటోంది. మాన్యత గురించి తనకు ఎక్కువగా తెలియదని ఆమె అంటోంది. తన అత్త ప్రియాదత్ తో మాత్రం త్రిషాలా ప్రతి రోజూ మాట్లాడుతోందట.