అమెరికాకు జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన త్వరితగతిన కోలుకోవడం తెలిసిందే. వెన్నెముకకు తగిలిన దెబ్బల వల్ల మరి కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
వేసవిలో సేదదీరడానికి కొద్దిరోజులపాటు అమెరికాలో గడపాలని జూనియర్ ఎన్టీఆర్ భావించారు. పనిలో పనిగా అక్కడోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సన్నిహితులు సూచించారు. దీంతో త్వరలో అమెరికా వెళ్ళి ఓ 20 రోజులపాటు అక్కడే మకాం వేయనున్నట్టు తెలిసింది. తన పుట్టినరోజు తర్వాత అమెరికా వెళ్ళాలని జూనియర్ భావిస్తున్నారు.
ఈలోగా మరో కార్యక్రమానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహాకూటమి విజయం సాధిస్తే.. భాగస్వామ్య పక్షాలు నిర్వహించే విజయోత్సవ సభలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం. అయితే, ఈ కార్యక్రమం ఉండేదీ లేనిదీ.. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయితేగాని తేలదు.