ఎస్ఎస్పీ యాదవ్ వైయస్ భక్తి
కడప: కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వెంటనే మాజీ డిజిపి ఎస్ ఎస్పీ యాదవ్ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురై సెలవుపై వెళ్లిన ఆయన గురువారం అకస్మాత్తుగా ఇడుపుల పాయకు వచ్చి తన స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారు. ఇడుపుల పాయలోని ట్రిపుల్ ఐటీలో వైఎస్ తరగతి గదులన్నీ కలియ తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటిస్తుండగా యాదవ్ కూడా ఆయన వెంటే ఉన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.సి.రెడ్డి, ట్రిపుల్ ఐటీ అధికారులతో ముఖ్యమంత్రి దాదాపు 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ్ రెండు నిమిషాలపాటు వైఎస్ తో మాట్లాడినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పక్కనే ట్రిపుల్ ఐటీకి వైఎస్ తన తనయుడు జగన్ను కూడా వెంటబెట్టుకుని వచ్చారు.
ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ఉండగా యాదవ్ 12 గంటలకే ఇడుపులపాయకు చేరుకున్నారు. అడ్వకేట్ జనరల్ మోహన్ రెడ్డి, కేసీ రెడ్డితో కలిసి ట్రిపుల్ ఐటీ ప్రాంగణమంతా తిరిగారు. వైఎస్ పులివెందుల నుంచి మధ్యాహ్నం 2.30 కల్లా ఎస్టేట్కు చేరుకున్నారు. 3.20కి ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ విద్యార్థులతో గడిపారు. అనంతరం ఎస్టేట్కు చేరుకున్నారు. ఇక్కడ కూడా యాదవ్ వైఎస్, జగన్ తో కాసేపు చర్చలు జరిపినట్లు సమాచారం.