జయప్రదది రాజకీయ డ్రామా: అజం
రాంపూర్: తమ పార్టీ నాయకురాలు జయప్రద ఆరోపణలను రాజకీయ నాటకంగా సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆజంఖాన్ కొట్టిపారేశారు. సిడిలను మార్చి తాను పంపిణీ చేయడం ద్వారా విజయావకశాలను దెబ్బ తీయడానికి జయప్రద చేస్తున్న ఆరోపణలు రాజకీయ డ్రామా మాత్రమేనని ఆయన అన్నారు. తరుచుగా రంగులు మార్చడం సినీ తారలకు మామూలేనని ఆయన వ్యాఖ్యానించారు.
సిడిలను మార్చడంలో తన పాత్ర ఏమీ లేదని, తన సోదరి విషయంలోనో తల్లి విషయంలోనో అలా చేయలేనని, ఎలా తాను అంత చౌకబారు చర్యకు దిగుతానని ఆయన అన్నారు. ఆ సిడిలు జయప్రదకు ఎవరిచ్చారో చెప్పాలని ఆయన అడిగారు. తాను సిడిని చూడలేదని, వోటర్లు గానీ జిల్లా మెజిస్ట్రేట్ గానీ పోలీసులు గానీ చూడలేదని, ఆ సిడిలు జయప్రదకు ఎవరిచ్చారని, వాటిని ఎవరు రూపొందించారని, వాటిని పోలీసులకు జయప్రదనే ఇవ్వాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
సైద్ధాంతిక ప్రాతిపదికపైనే తాను పార్టీలో పోరాటం చేస్తున్నానని, ప్రత్యేకంగా తన పోరాటం బాబ్రీ మసీదు కూల్చివేత నిందితుడు కళ్యాణ్ సింగ్ కు సన్నిహితుడైన నాయకుడిపై జరుగుతోందని ఆయన చెప్పారు. పార్టీలో విభేదాలు ఉండవచ్చునని, అయితే మీడియాలో వస్తున్నట్లుగా తమ మధ్య పోరు ఏదీ లేదని ఆయన అన్నారు. మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారు. వివాదం తనకూ పార్టీ అధినేతకు మధ్య సాగుతోందని, తాము చర్చించి పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో పునాదే లేని అమర్ సింగ్ తో తనను జత కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రజల్లోనే అమర్ సింగ్ కు మద్దతు లేదని ఆయన చెప్పారు.