వైయస్ వ్యాఖ్యలతో నష్టమే: కెకె
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, వైయస్ వ్యాఖ్యలను చూస్తే ఓడిపోతున్నామనే భావన కలుగుతోందని పిసిసి మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు అన్నారు. ఆంధ్ర, రాయలసీమల్లో గెలిచేవారికే ఓటు వేయాలనుకునే సంప్రదాయం ఉందని, వైయస్ వ్యాఖ్యలతో నష్టం జరిగిందని ఆయన అన్నారు.రాష్ట్రంలో ఏ పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని, వైఎస్సే తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మంగళవారం మాట్లాడారు. లౌకికవాద పార్టీలైన ప్రజారాజ్యం, తెరాసలు కేంద్రంలో భాజపాతో జతకడతాయని తాను భావించడంలేదన్నారు. తెరాసతో మాట్లాడటంలేదని ఎందుకనుకుంటారని ప్రశ్నించారు. మద్దతు కోసం చివరిదాకా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎన్నికలకు ముందే బిజెపితో వెళ్తామని తెరాస చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణపై మంత్రి రోశయ్య కమిటీ ఒక రాజకీయ ప్రయత్నం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంపై అవగాహన ఉన్న వారెవరూ ఈ కమిటీకి రాజ్యాంగపరమైన హోదా ఉందంటే నమ్మరని తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెప్పేందుకు చేసిన ప్రయత్నంగా మాత్రం చూడాలని చెప్పారు. లౌకికవాద, భావసారూప్యత కలిగిన పార్టీల కోసం కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలనే అంశం కాంగ్రెస్లో చర్చకు వస్తుండడాన్ని ప్రస్తావిస్తూ దానికి ఇప్పుడు సమయం కాదని ఆయన అన్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీ గెలుపులో కీలకం అవుతాయనీ, వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీసీ సీఎం కావాలనడం పాపం కాదని, దానికి ఇది సమయం కాదని అన్నారు.