పాలకొల్లులో చిరుపై కోట్ల పందాలు
చిరంజీవి గెలిస్తే రూ. 50 లక్షలు, ఓటమి చెందితే రూ. కోటి రూపాయలు ఇచ్చే రీతిలో కొందరు సిండికేట్గా ఏర్పడి పెద్ద పందెం కాశారు. చిరంజీవికి 5 వేల నుంచి 25 వేల వరకు మెజార్టీ వస్తుందని కొంతమంది పందాలు కాశారు. మరికొందరైతే పాలకొల్లుతోపాటు తిరుపతి స్థానంపై కూడా ఇక్కడ పందెం కట్టారు. పశ్చిమ డెల్టాలోని మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి చిరంజీవి గెలుపుతోపాటు జిల్లాలో ప్రజారాజ్యం పదిస్థానాలు వస్తాయని తూర్పుగోదావరి జిల్లా మద్యం వ్యాపారులతో రూ. 50 లక్షలకు పందెం కాశారు. అసలు పాలకొల్లులో చిరంజీవిది మూడోస్థానమంటూ రూ. 10 లక్షల వరకు పందాలు జరిగాయి. ఇందులో ఇంకో కోణమూ ఉంది. పాలకొల్లులో చిరంజీవి మెజార్టీకన్నా నరసాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు మెజార్టీ ఎక్కువ వస్తుందని లక్షల్లో పందాలు మొదలయ్యాయి.
పాలకొల్లులో చిరు అభిమాని ఒకరు రూ. 20 లక్షల విలువ చేసే తన భవనాన్ని పణంగా పెట్టారు. యలమంచిలి మండలానికి చెందిన ప్రరాపా నేత చిరంజీవి 10 వేలు మెజార్టీతో గెలుస్తారని రెండెకరాల కొబ్బరి తోటను పణంగా పెట్టారు. రాష్ట్రంలో ప్రరాపా అధికారంలోకి వస్తుందని, 50 స్థానాలకు పైగా వస్తాయని, 30 స్థానాలు దాటవని ఇలా అనేక పందాలు జరిగాయి. పాలకొల్లులో ఇద్దరు రిక్షా కార్మికులు చిరంజీవిపై తమ రిక్షాలను పణంగా పెట్టుకున్నారు.