తెలంగాణ భవన్ లో తెరాస క్యాంపు
హైదరాబాద్: హైదారాబాదులోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శిబిరం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. తట్టాబుట్టా సర్దుకుని పార్టీ లోకసభ, శాసనసభ సీట్ల అభ్యర్థులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెరాస సీనియర్ నాయకులు, మేధావులు కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అయితే దీన్ని శిబిరం అనడాన్ని తెరాస నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తాము తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడానికి సమావేశమవుతున్నామని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తాము సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ హంగ్ రావచ్చుననే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో తెరాస శిబిరానికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో మహాకూటమికి మెజారిటీ వస్తుందని తెరాస నాయకులు అంటున్నప్పటికీ అంత నమ్మకంగా లేనట్లు కనిపిస్తోంది. హంగ్ వచ్చే పరిస్థితిలో గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా, ప్రలోభాలకు లొంగిపోకుండా తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తగా ఈ శిబిరాన్ని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రీతిలో ఫలితాలు వెలువడగానే పావులు కదపాలనేది తెరాస నేత కె.చంద్రశేఖర రావు వ్యూహంగా కనిపిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అందరూ ఒక చోట ఉండాలనేది తమ ఉద్దేశమని ఎ.చంద్రశేఖర్ అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ పార్టీతో కలవడానికైనా తాము సిద్ధమని హరీష్ రావు అన్నారు. ఎన్డీయెతో తాము జత కట్టడాన్ని ఆయన సమర్థించుకుంటున్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులతో శుక్రవారం మధ్యాహ్నం కెసిఆర్ సమావేశమవుతారు. ఆయన మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకుంటారు.