కాంగ్రెస్ గెలుపు వెనుక లోక్ సత్తా?
హైదరాబాద్: నూతన రాజకీయ పార్టీ లోక్ సత్తా దాదాపు పాతిక మంది మహా కూటమి అభ్యర్ధుల జాతకాలను తారుమారు చేసింది. టిడిపి నాయకత్వంలోని మహాకూటమికి, లోక్ సత్తాకు కొన్ని సారూప్యతలు ఉండడం వల్ల లోక్ సత్తా చీల్చుకున్న ఓట్ల ప్రభావం కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. మహాకూటమికి ఏ మాత్రం అవకాశం లేకుండాపోయి కాంగ్రెస్కు స్పష్టమైన విజయం దక్కిందంటే అది లోక్సత్తా పుణ్యమే. తెలుగుదేశం ఓట్లను లోక్సత్తా భారీగా చీల్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు స్పష్టమవుతోంది. ఈ పాతిక స్ధానాల్లో లోక్ సత్తా తెచ్చుకున్న ఓట్లు కాంగ్రెస్ అభ్యర్ధుల మెజారిటీ కంటే ఎక్కువగా ఉన్నట్టు విశ్లేషణలో తేలింది.
లోక్సత్తా అభ్యర్థి లేకుంటే ఈ ఓట్లన్నీ తెలుగుదేశం నేతృత్వంలోని మహా కూటమికి పడి ఉండేవనేది చాలామంది అంగీకరించే సత్యం. తెలుగుదేశం ఓట్లను పీఆర్పీ కూడా అనేక చోట్ల చీల్చి కాంగ్రెస్ గెలుపుకు బాటలు పరిచింది. అయితే కేవలం చీల్చడానికే పరిమితం కాకుండా పీఆర్పీ 18 స్థానాలనైనా గెల్చుకోగలిగింది. కానీ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన లోక్సత్తా... రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమికి దక్కాల్సిన 24 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడానికి కారణమైందని గణాంకాలను బట్టి అర్థమవుతోంది.
ఈ 24 సీట్లు కాంగ్రెస్కు బదులు కూటమి ఖాతాలో పడి ఉంటే... హంగ్ అసెంబ్లీలో మహా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 156 సీట్లు రాగా, మహా కూటమికి 107 లభించాయి. ఈ 24 సీట్లూ కూటమికి దక్కితే కాంగ్రెస్కు 132, కూటమికి 132 లభించి ఉండేవి. సీన్ మొత్తం మారిపోయి ఉండేది. హంగ్ అసెంబ్లీ వచ్చి పలు రకాల రాజకీయ సమీకరణాలకు అవకాశం ఏర్పడేది. పీఆర్పీ పాత్ర కీలకమై ఉండేది.