తారలు తేలిపోయిన వేళ
ప్రరాపాలో అన్నీ తానై వ్యవహరించిన చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ అనకాపల్లిలో ఓడిపోయారు. రాజమండ్రి లోకసభ స్థానానికి పోటీ చేసిన సినీనటులు మురళీమోహన్(తెదేపా), కృష్ణంరాజు(ప్రరాపా)లు కూడా పరాజయం పాలయ్యారు. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా నిర్మిస్తున్న వంశీమోహన్కృష్ణ తెదేపా తరఫున విజయవాడ పార్లమెంటు స్థానంలో బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. ఏలూరు లోకసభ స్థానానికి పోటీచేసిన సినీ నిర్మాత, తేదేపా అభ్యర్థి మాగుంట బాబుదీ అదే దారి. ఏలూరు అసెంబ్లీ స్థానంలో తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన మరో సినీ నిర్మాత అంబికాకృష్ణ కూడా ఓటమిపాలయ్యారు.
గుడివాడలో తేదేపా అభ్యర్థి, సినీ నిర్మాత కొడాలి నాని మంత్రి పిన్నమనేనిపై విజయం సాధించారు. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రరాపా తరఫున పోటీ చేసిన సినీ నిర్మాత, నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఓటమిపాలయ్యారు. మెదక్ జిల్లా ఆంథోల్ నుంచి పోటీ చేసిన బాబూమోహన్ మరోసారి ఓడిపోయారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట బరిలో నిలిచిన తేదేపా అభ్యర్థి, సినీ నిర్మాత చెంగల వెంకట్రావు పరాజితులయ్యారు. కాకినాడ లోకసభ స్థానం నుంచి ప్రరాపా తరఫున పోటీ చేసిన సినీ నిర్మాత చెలమశెట్టి సునీల్ ఓటమిపాలయ్యారు.