ఒయులో ఆందోళన: విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్: బలవంతంగా హాస్టల్ గదులను ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయం యాజమాన్యం చర్యను నిరసిస్తూ వారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు హైదరాబాదులోని విద్యానగర్ వద్ద అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారు జామున విశ్వవిద్యాలయం అధికారులు హాస్టళ్లకు వచ్చి గదులను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు. దీన్ని విద్యార్థులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాళాలు వేసిన గదులను కూడా అధికారులు వదిలేయలేదు. తాళాలు పగులగొట్టి గదుల్లోని సామాన్లను బయటకు విసిరేశారు. ఈ నెల 22వ తేదీ వరకు పోటీ పరీక్షలున్నాయని, కొంత మందికి బ్యాక్ లాగ్ లు కూడా ఉన్నాయని చెబుతూ ఈ నెల 20వ తేదీ వరకు హాస్టళ్లలో ఉండడానికి అనుమతివ్వాలని విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారులను కోరారు. దానికి అంగీకరించిన విశ్వవిద్యాలయం యాజమాన్యం అకస్మాత్తుగా మంగళవారం ఉదయం గదులను ఖాళీ చేయించడానికి పూనుకుంది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.