గవర్నర్ ను కలిసిన సిఎల్పీ ప్రతినిధులు
హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం గవర్నర్ ఎన్డీ తివారీని కలిసింది. సిఎల్పీ నేతగా వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికైనట్లు ఆ ప్రతినిధులు గవర్నర్ కు అందజేశారు. ఈ మేరకు ఒక లేఖను వారు గవర్నర్ కు సమర్పించారు. వైయస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా వారు కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ ఇచ్చినట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ప్రమాణం చేస్తారని ఆయన చెప్పారు. సిఎల్పీ నేతను సూచించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ తొలుత సిఎల్పీ నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ సూచన మేరకు వైయస్ రాజశేఖర రెడ్డిని సిఎల్పీ తమ నేతగా ఎన్నుకున్నట్లు ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు.
గవర్నర్ ను కలిసినవారిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో పాటు మంత్రులు రోశయ్య, పొన్నాల లక్ష్మయ్య, చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తదితరులు ఉన్నారు.