చిరు పార్టీలో కుమ్ములాటలు
హైదరాబాద్: ఎన్నికల్లో ఘోర అపజయాన్ని చవి చూసిన చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలోని కుమ్ములాటలు గురువారం బయటపడ్డాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశం ఈ కుమ్ములాటలకు వేదిక అయింది. తనపై వచ్చిన విమర్శలతో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ సిద్ధపడినట్లు సమాచారం. అలాగే తీవ్ర అసంతృప్తికి గురైన చేగొండి హరిరామ జోగయ్య, టి.దేవేందర్ గౌడ్ సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.
పిఎసితో పార్టీకి చెందిన అన్ని కమిటీల రద్దుకు సమావేశంలో ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు ప్రజారాజ్యం పిఎసి శుక్రవారంనాడు కూడా సమావేశం కానుంది. ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 శాసనసభా స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఒక్క పార్లమెంటు సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఎన్నికల సమయంలో టిక్కెట్ల పంపిణీపై అల్లు అరవింద్ మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను అల్లు అరవింద్ ఖండించినప్పటికీ గురువారం జరిగిన సమావేశంలో వచ్చిన విమర్శలకు ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. పోలింగ్ కు ముందే పరకాల ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అల్లు అరవింద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులను సమిష్టిగా ఉంచుకునే సత్తా పార్టీకి లేకుండా పోయిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది శాసనసభ్యులు పార్టీకి దూరం కావడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అల్లు అరవింద్, దేవేందర్ గౌడ్ కమిటీకి రాజీనామా చేయాలని కొంత మంది పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.