భయపడేది లేదు: తెలుగుదేశం
హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు చూసి ఓడిపోయేది లేదని, నిరుత్సాహ పడేది కూడా లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ గజపతి రాజు, కెఇ కృష్ణమూర్తి, నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టిడిఎల్పీ) సమావేశానంతరం వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని వారు చెప్పారు. కాంగ్రెసు పార్టీ కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో గెలిచిందని, అది కాంగ్రెస్ అదృష్టమని వారు అభిప్రాయపడ్డారు. ప్రలోభాలకు లొంగకుండా తమ పార్టీ నాయకులు పని చేయాల్సి ఉంటుందని, చేస్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని వారు చెప్పారు.
రాష్ట్రంలో రెండు పార్టీల లేదా కూటముల వ్యవస్థ రూపుదిద్దుకునే పరిస్థితులున్నాయని వారు చెప్పారు. తమ ఫలితాలపై లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీలు ప్రభావం చూపాయని వారన్నారు. 24 సీట్లలో లోకసత్తా వల్ల తమకు నష్టం జరిగిందని వారన్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రభావం కూడా తమపై పడిందని వారు చెప్పారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లోని పరిస్థితిని మరోసారి సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. కాంగ్రెసుకు గతంలో కన్నా సీట్లు తగ్గాయని వారన్నారు. తెలుగుదేశం ఓటమికి కలత చెందిన ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల కుటుంబాలను ఆదుకుంటామని వారు చెప్పారు.