అల్లు అరవిందే కీలకం: చిరు
అరవింద్ కీలకం కనుక పార్టీని నిర్వీర్యం చేయాలని పకడ్బందీగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏ ముహూర్తాన ప్రచారం ప్రారంభించారో అది దారుణంగా మారిందన్నారు. టికెట్ రాని కొందరు పనిగట్టుకుని ఈ విధంగా ప్రచారం చేశారని, టికెట్టు రాలేదనే అక్కసులో ఇలా చేస్తున్నారని పట్టించుకోకపోవటంతో అలుసుగా తీసుకుని ఎక్కువగా చేశారని దయ్యబట్టారు. పార్టీ వైఫల్యాలపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైందని, మరో రెండు రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. పూర్తి స్థాయిలో చర్చ జరిగాక అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. కమిటీలన్నింటినీ పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. పార్టీ పదవికి అరవింద్ రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చిరంజీవి స్పష్టం చేశారు. సీనియర్ నేత జోగయ్య మోకాలి నొప్పితో ముందుగానే వెళ్లారని తెలిపారు. దేవేందర్ గౌడ్ సమావేశం పూర్తయ్యేవరకు ఉంటే ఆయన మధ్యలోనే నిష్క్రమించారని ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. పార్టీకున్న రెండో కార్యాలయాన్ని మూసేస్తారనే దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ చీలిపోతుందని సైతం వదంతులు రావటం దారుణమని వ్యాఖ్యానించారు.
రద్దీ లేదు కదా అని ముందు ద్వారం నుంచి పార్టీ కార్యాలయంలోకి ప్రవేశిస్తుంటే వాస్తుతో రూటు మార్చిన చిరంజీవి అని పత్రికలు రాయటం సరికాదని, తనకు వాస్తుపై నమ్మకం లేదని చెప్పారు. తనకు ఎలాంటి మూఢనమ్మకాలు లేవని స్పష్టం చేశారు.